కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ హైదరాబాద్ను ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిదని విమర్శించారు. హామీల అమలులో విఫలం చెందిందని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భూములు కొనేవారు లేకుండా పోయారని అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులు చూపెడుతున్నారని మండిపడ్డారు. నేడు రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఉద్యోగాలు రాకుండా పోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. గత ప్రభుత్వాన్ని బాద్నా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఇచ్చేవారు. కేసీఆర్ బస్సుయాత్ర ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్, బీజేపీలు కొత్త డ్రామాకు తెరలేపాయి అంటూ విరుచుకుపడ్డారు.
Article Categories:
రాజకీయాలు