నీటి సంరక్షణ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఘటన నగర పరిధిలోని టోలిచౌకిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యనగర్ కాలనీకి చెందిన గులాం మహ్మద్(78) అదివారం బైక్పై వెళ్తున్నాడు. అయితే, అదే ప్రాంతంలో HMWSSC సంస్థ ఆధ్వర్యంలో అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు భూగర్భ మురుగు నీటి పనుల కోసం పెద్ద గుంతను తవ్వారు. గుంత చుట్టూ బారీకేడ్లను సరిగా బిగించకపోవడంతో ప్రమాదవశాత్తు గులాం అహ్మద్ ఆ గుంతలో పడిపోయాడు. ఘటన జరిగిన వెంటనే అక్కడున్న సిబ్బంది అతడిన సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రే అతను మరణించాడు. దీంతో గులాం మహ్మద్ కుమారుడు అమీర్ సయీద్, అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సూపర్వైజర్, కాంట్రాక్టర్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) అధికారిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Article Categories:
వార్తలు