
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కేతేపల్లి మండలానికి చెందిన పలువురు యువకులు ఆత్మకూరు (ఎస్)మండలం నెమ్మికల్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట మండలం రాజుగారి తోట హోటల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు ఉన్న స్కూటీ కి అతి సమీపంలోకి రావడంతో దానిని అదుపు చేయబోయి రోడ్డు అవతల ఉన్న ఓ తోటలోకి కారు దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణం చేస్తున్న సాయి, నవీన్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన నలుగురు యువకులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Article Categories:
వార్తలు
