
దేశంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అవార్డుల ప్రధాన కార్యక్రమం నేడు రాష్ట్రపతి భవన్లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేయనున్నారు. ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని, వ్యవసాయ రంగం పటిష్టం చేసేందుకు కృషి చేసిన జాట్ నేతగా పేరొందిన చౌదరి చరణ్ సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్లకు భారత రత్న అవార్డు ప్రకటించింది కేంద్రం. ఈ నలుగురు ప్రముఖుల సేవలు స్మరిస్తూ.. మరణాంతరం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఈ నలుగురు ప్రముఖుల కుటుంబ సభ్యులకు రేపు రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు అందజేయనున్నారు. మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి కూడా భారత రత్న ప్రకటించింది కేంద్రం. అయితే, ఈ అవార్డును స్వయంగా రాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖులు అద్వానీ నివాసానికి వెళ్లి రేపు అవార్డును ప్రధానం చేయనున్నారు.

